:: ఉపాధ్యాయ కొలువుతో... ఉన్నతమైన కెరీర్! ::.

:: ఉపాధ్యాయ కొలువుతో... ఉన్నతమైన కెరీర్! ::.

 

:: ఉపాధ్యాయ కొలువుతో... ఉన్నతమైన కెరీర్! ::.

 
 

సమాజంలో ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవం. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులకిచ్చారు. ఈ వృత్తి.. సమాజంలో ఓ బృహత్తర బాధ్యత. ఉపాధి కల్పించే మార్గం కూడా. ఫలితంగా ఈ వృత్తిపై మక్కువ చూపే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ రంగంలో వేల సంఖ్యలో ఖాళీలు భర్తీ చేస్తుండగా.. అటు ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలకు ఆకాశమే హద్దుగా ఉంటోం ది. ఇటీవలి కాలంలో విద్యా రంగం విస్తరిస్తుండడం.. అమల్లోకి వచ్చి న విద్యాహక్కు చట్టం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీకి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. కెరీర్ ఆప్షన్‌గా టీచింగ్ ప్రొఫెషన్‌పై ఫోకస్..

ప్రవేశం.. ఇలా:
ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి మార్గాలెన్నో. పదో తరగతి మొదలు.. డిగ్రీ అర్హతగా పలు విభాగాల్లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీలుగా కెరీర్ ప్రారంభించవచ్చు. 

మాంటిస్సోరి ట్రైనింగ్:
ప్రీ-ప్రైమరీ స్థాయి (3-5 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు) లో బోధించేందుకు ఉద్దేశించిన కోర్సు మాంటిస్సోరి ట్రైనింగ్. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడం, బొమ్మల సహాయంతో వారిలో నైపుణ్యాలను పెంచేందుకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో తర్ఫీదునివ్వడం ఈ కోర్సు ప్రత్యేకత. ప్రస్తుతం ఐదు దశల్లో ఈ కోర్సు ఉంది. అవి.. సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్(ఎర్లీ చైల్డ్‌హుడ్); డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; హయ్యర్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; వీటిలో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి కనీస అర్హత పదో తరగతి. ఆ తర్వాత ఒక్కో దశ శిక్షణ పూర్తి చేసుకుంటూ డిగ్రీతో సమానమైన ప్రొఫెషనల్ డిప్లొమా వరకు చేరుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ కోర్సును పూర్తి చేస్తే అవకాశాలు అపారమనేది నిస్సందేహం. గతంలో నగరాలకు పరిమితమైన కిండర్‌గార్టెన్‌లు ఇప్పుడు టైర్-2 పట్టణాల్లోనూ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20వేలకు పైగా కిండర్‌గార్టెన్‌లు, నర్సరీ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో అవకాశాలు పుష్కలం. ప్రతిభ, అనుభవం ఆధారంగా నెలకు రూ.5-10 వేలు వరకు వేతనం ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ, మాంటిస్సోరి-హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ (https://www.indianmontessoricentre.org)ల్లో సంబంధిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

డీఈడీ:
ఇంటర్మీడియెట్‌తోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించే కోర్సు.. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ). ఈ కోర్సులో ప్రవేశం కోసం డైట్ సెట్ రాయూలి. వ్యవధి: రెండేళ్లు. ప్రథమ సంవత్సరంలో.. విద్యామనో విజ్ఞాన శాస్త్రం, విద్యాతత్వ శాస్త్రం, జనరల్ అంశాలైన పూర్వ ప్రాథమిక విద్య-ప్రస్తుత విద్య, ఆరోగ్యం, విద్య- కంప్యూటర్ ఎడ్యుకేషన్, వయోజన విద్య తదితర సబ్జెక్టులు ఉంటాయి. రెండో సంవత్సరంలో.. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల బోధన పద్ధతులను బోధిస్తారు. కోర్సులో భాగంగా.. టీచింగ్ ప్రాక్టీస్ 75 రోజులు ఉంటుంది. ఇందులో 35 రోజులు ప్రాథమిక పాఠశాలలు, 10 రోజులు ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించాలి. 30 రోజులపాటు పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 23 ప్రభుత్వ ‘డైట్’ కళాశాలలు ఉన్నారు. ప్రతి కళాశాలకు 100 సీట్లు. ప్రైవేట్‌లో సుమారు రెండు వందల కళాశాలల్లో.. దాదాపు 10 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. డీఈడీ ఉత్తీర్ణులు ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష-డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుకు అర్హులు. 2012 నుంచి ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే నిర్ణయం ఈ కోర్సు చేసిన వారికి వరంగా మారింది. కారణం డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్‌జీటీ పోస్టుల సంఖ్యే ఎక్కువగా ఉండటం.. డీఈడీ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఎస్‌జీటీ పోస్ట్ ఖాయమని చెప్పొచ్చు.

ఎడ్‌సెట్:
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ). వ్యవ ధి సంవత్సరం. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) రాయాలి. డిగ్రీలో చదివిన ఆప్షనల్ సబ్జెక్టుల ఆధారంగా ఎడ్‌సెట్ ఉంటుంది. విద్యాతత్వ శాస్త్రం, విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, పాఠశాల పరిపాలన-నిర్వహణ, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ టెక్నాలజీతోపాటు గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదివిన గ్రూప్ సబ్జెక్టుల్లో రెండింటికి సంబంధించిన బోధన పద్ధతులు బోధిస్తారు. శిక్షణ సమయంలో 45 రోజులపాటు పాఠశాలకు వెళ్లి బోధన (ప్రాక్టికల్స్) చేయూలి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి దాదాపు 615 కాలేజీల్లో దాదాపు 65 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఈడీ ఉత్తీర్ణులు.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు. వీరిని స్కూల్ అసిస్టెంట్‌లుగా వ్యవహరిస్తారు. డీఎస్సీ ద్వారా ఎస్‌ఏ ఎంపిక జరుగుతుంది. 

ఫిజికల్ ఎడ్యుకేషన్:
ఎడ్యుకేషన్‌లో భాగంగా ఆటలు, వ్యాయామం వంటి ఫిజికల్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండాలి. అందుకే ప్రభు త్వం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా ప్లే గ్రౌండ్ ఉండాలని నిబంధన విధించింది. తదనుగుణంగా ప్రతి పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) ఉంటాడు. పీఈటీగా కెరీర్ ప్రారంభించాలంటే సంబంధిత కోర్సులు చేయాలి. మనరాష్ట్రంలో ఇందుకోసం రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ)-అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం; బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ)అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. వీటిలో ప్రవేశానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్) రాయాలి. రాష్ర్టంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 13 కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీపీఈడీ చేసిన అభ్యర్థులు... హైస్కూల్స్‌లో ిపీఈటీలుగా కెరీర్ ప్రారంభించవచ్చు. డీఎస్సీ ద్వారా పీఈటీల ఎంపిక ఉంటుంది. 

లాంగ్వేజ్ పండిట్స్: 
తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. అటువంటి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్) రాయాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండిట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలుగు పండిట్-అర్హత: బీఏ (తెలుగు లిటచరేచర్/ఓరియెంటల్ లాంగ్వేజ్-తెలుగు/తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్/ఎంఏ-తెలుగు). హిందీ పండిట్: హిందీ ఆప్షనల్‌తో డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్-హిందీ/దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రవీణ లేదా హిందీ ప్రచార సభ-హైదరాబాద్ విద్వాన్ కోర్సు లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న హిందీ (బీఏ స్థాయి)/తత్సమానం లేదా ఎంఏ(హిందీ). లాంగ్వేజ్ పండిట్ కోర్సులను చేసిన అభ్యర్థులు.. హైస్కూల్స్‌లో లాంగ్వేజ్ పండిట్‌లుగా చేరొచ్చు. తెలుగులో కోర్సు పూర్తి చేసిన వారిని టీపీటీలుగా, హిందీ అభ్యర్థులను హెచ్‌పీటీలుగా పిలుస్తారు. వీరిని కూడా డీఎస్సీ ద్వారా ఎంపిక చేస్తారు. 

స్పెషల్ ఎడ్యుకేషన్:
గత దశాబ్ద కాలంగా ఆదరణ పొందుతున్న విభాగం స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ,సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ కోర్సులో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్,విజువల్, ఆటిజం, ఇంపెయిర్‌మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌ను ప్రత్యేకంగా పరిగణించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఈ కోర్సులను పూర్తి చేస్తే దేశ, విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా; వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. ఈసీఎస్‌ఈ/సీఎస్‌ఈల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్‌ల్లో పనిచేయొచ్చు. అంగన్‌వాడీ పాఠశాలలు, ప్రైవేటు ప్రీ స్కూళ్లలో ప్రత్యేక శిక్షణ అవసరమైన చిన్నారులకు కోఆర్డినేటర్‌గా అవకాశాలు లభిస్తాయి. సొంతంగా ప్రీ స్కూల్‌ను నిర్వహించవచ్చు. జీతభత్యాలు ప్రారంభంలో నెలకు రూ.8000 - 12000 వరకు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.25000 వరకు అందుకోవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్; స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్ -సికింద్రాబాద్; ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం (www.andhrauniversity.info); శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం-తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-ఆంధ్ర మహిళ సభ-హైదరాబాద్ (www.andhramahilasabha.org.in) బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఠాగూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ హ్యాండీక్యాప్డ్ తదితర 24 ఇన్‌స్టిట్యూట్‌లలో స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అవకాశాలు:
ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తి ఆకర్షణీయమైన ఉపాధి మార్గంగా మారుతోంది.ప్రభుత్వం తరచూ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్ ద్వారా వేలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తుండటం ప్రధాన కారణం. అంతేకాక ఉద్యోగ భద్రత, కొత్త పీఆర్‌సీ ప్రకారం ప్రారంభంలోనే ఐదంకెల జీతం అందుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండే స్కూల్స్‌లో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగం రోజురోజుకు విస్తరించి చిన్న పట్టణాల్లోనూ కాన్వెంట్‌లు, నర్సరీలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఏర్పాటవుతుండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. ప్రతిభ, అనుభవం ఆధారంగా ప్రైవేట్ సంస్థలు నెలకు దాదాపు రూ.15- రూ.20 వేల వరకు చెల్లిస్తున్నాయి.

ప్రమోషన్లు:
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా.. ఎస్‌జీటీ, ఎస్‌ఏగా కేడర్‌లో కెరీర్ ప్రారంభించి, ఉన్నత విద్యనభ్యసిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. బీఈడీ/ఎంఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందొచ్చు. సీనియూరిటీతో మండల విద్యాధికారి, డిప్యూటీ డీఈవో స్థాయికీ చేరుకోవచ్చు. పీజీ పూర్తిచేస్తే.. జూనియర్ లెక్చరర్ స్థాయికి చేరుకోవచ్చు.

టెట్ తప్పనిసరి: 
గతంలో మాదిరిగా కేవలం ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తే సరిపోదు. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్), కేంద్ర స్థాయిలోని కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయ విద్యాలయాలు మొదలైన పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలంటే .. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ) స్కోర్ తప్పనిసరి. టెట్ మార్కులకు టీచర్స్ ఎంపిక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. ఈ రెండు పరీక్షల స్కోర్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే బీఎడ్/డీఎడ్/ భాషా పండితులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.

రెండు పేపర్లుగా ఉండే టెట్..
పేపర్-1: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే టీచర్లు ఈ పేపర్ రాయాలి.
పేపర్ -2: ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే టీచర్లు ఈ పేపర్ రాయాలి.
టెట్‌లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, పీహెచ్‌సీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. సీటీఈటీలో 60 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణత సాధించినట్లు.

కావలసిన లక్షణాలు:

  1. విషయాన్ని ప్రభావవంతంగా వివరించే కమ్యూనికేషన్ స్కిల్స్
  2. మూస ధోరణి కాకుండా విభిన్న పద్ధతుల్లో బోధించడం
  3. ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం
  4. పాజిటివ్ దృక్పథం కలిగి ఉండడం
  5. సబ్జెక్ట్ పరంగా వస్తున్న మార్పులను గమనించడం
  6. ఆర్గనైజింగ్ స్కిల్స్
  7. ఉన్నత విద్య ద్వారా ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడం
  8. సమయస్ఫూర్తి కలిగి ఉండడం